Saturday, August 11, 2012

Road accident in america.. 5 telugu people are died..


అమెరికాలో ఘోర ప్రమాదం
ఐదుగురు తెలుగువారి దుర్మరణం
ట్రాక్టర్ ట్రైలర్‌ను ఢీకొన్న కారు
ఓక్లహామా నగరంలో దుర్ఘటన
మృతులంతా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే
ముగ్గురు హైదరాబాదీలు, ఒకరు ఖమ్మం వాసి

ఓక్లహామా, ఆగస్టు 10: అమెరికాలోని ఓక్లహామా నగరంలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తెలుగు యువకులు మరణించారు. వీరంతా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరిని.. సుబ్బయ్యగారి జస్వంత్‌రెడ్డి, గాదె ఫణీంద్ర, అంతటి అనురాగ్, శ్రీనివాస్, వెంకట్‌గా గుర్తించారు. గురువారం రాత్రి వీరంతా ఒకే కారులో ప్రయాణిస్తున్నారు.

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఒంటిగంట సమయంలో.. వీరి కారు ఇంటర్‌స్టేట్ 40 రహదారి నుంచి ఐ-35 వైపు తిరుగుతూ అదుపుతప్పి ట్రాక్టర్ ట్రెయిలర్‌ను ఢీకొంది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమైపోయింది. తలుపులు విసురుగా తెరుచుకుని అంతా రోడ్డు మీదకు పడిపోయారు. కారుకు మంటలు అంటుకున్నాయి. ఆ ఐదుగురూ అక్కడికక్కడే మరణించారు.

వీరెవరూ సీట్‌బెల్టులు పెట్టుకోలేదని, అందుకే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. చనిపోయినవారిలో వెంకట్‌కు వివాహమైంది. మిగతా వారంతా అవివాహితులేనని సమాచారం. వీరి మృతదేహాలను భారత దేశానికి పంపించడానికి తానా టీమ్ స్క్వేర్ అన్ని యత్నాలూ చేస్తున్నట్టు తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర తెలియజేశారు. తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ నన్నపనేని, ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ జరుగుల, టీమ్ స్క్వేర్ కమిటీ చైర్మన్ అంజయ్య చౌదరి లావు, టీమ్ స్క్వేర్ వాలంటీర్లు శ్రీకాంత్ రావా, రాజశేఖర్ భీమిరెడ్డి, రవి మల్లపురం ప్రభృతులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్నారు.

మృతుల వివరాలు..: ప్రమాదంలో మృతిచెందిన వారిలో ఒకరు ఖమ్మంజిల్లాకు చెందినవారు కాగా, మరొకరు హైదరాబాద్ వాసి అని, మిగతా ముగ్గురూ కూడా హైదరాబాద్ పరిసరప్రాంతాల వారేనని తెలిసింది. వీరిలో.. గాదె ఫణీంద్ర (28) ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలంలోని దామచర్లకు చెందిన గాదె శివప్రసాద్, స్వర్ణ దంపతుల కుమారుడు. ఆయన రెండు నెలల క్రితమే అమెరికా నుంచి వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్లారు.

మళ్లీ వస్తానంటూ చిరునవ్వుతో వెళ్లిన ఫణీంద్ర మరలిరాని లోకాలకు తరలిపోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. మృతుల వివరాల గురించి అమెరికన్ పోలీసు అధికారులను ఆంధ్రజ్యోతి శుక్రవారం అర్ధరాత్రి సంప్రదించగా.. వారిని గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, పాస్‌పోర్టులు తదితర పత్రాలు చూశాకగానీ పూర్తివివరాలు చెప్పలేమని పేర్కొన్నారు.